రెవెన్యూ వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లు 2020కి రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలకు సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం.. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. తెలంగాణ భూమి, పట్టాదారు పాసు పుస్తకాలపై హక్కుల పేరుతో రూపొందించిన నూతన బిల్లుకు పచ్చజెండా ఊపింది. నూతన రెవెన్యూ బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చించనున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి పలు బిల్లులను ఆమోదించింది.
మంత్రివర్గం ఆమోదం తెలిపిన బిల్లులు, ఆర్డినెన్సులు
- టీఎస్ బీపాస్ బిల్లు
- తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 సవరణ బిల్లు
- తెలంగాణ జీఎస్టీ చట్టం-2017 సవరణ బిల్లు
- తెలంగాణ సివిల్ కోర్టు చట్టం-1972 సవరణ బిల్లు
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020
- తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020
- ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002
- ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంచే ఆర్డినెన్సు
- తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లు
- ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్సు
కొత్త సచివాలయం నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేత ఖర్చులకు పరిపాలన అనుమతులను కేబినెట్ మంజూరు చేసింది. కొత్తగా నిర్మించే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలన అనుమతులను ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది. బీసీ జాబితాలో 17 కులాలను చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను రాష్ట్ర మంత్రి అంగీకరించింది. కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లులన్నీ ఈనెల 28 వరకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశ పెట్టి చర్చించనున్నారు.