ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపైనా, అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిపైనా కేసులు పెట్టడం, కక్ష సాధింపునకు దిగడం... పౌరులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కాలరాయడమేనని సీనియర్ న్యాయవాదులు ముప్పాళ్ల సుబ్బారావు, ఎస్.సుభాష్చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. పాలకుల్లో పెచ్చుమీరుతున్న ఈ అసహనం, విమర్శల్ని తట్టుకోలేకపోవడం, ప్రశ్నించే గళాలను నొక్కేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి, పౌరహక్కులకు గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. సుబ్బారావు, సుభాష్ చంద్రబోస్ న్యాయవాద వృత్తిలో ఉంటూనే, పౌర హక్కుల కోసం చిరకాలంగా పోరాడుతున్నారు. సుబ్బారావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి (ఏపీసీఎల్ఏ), భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ ఉమ్మడి రాష్ట్రంలో పౌరహక్కుల సంఘానికి (ఏపీసీఎల్సీ) అధ్యక్షుడిగా, రాష్ట్ర విభజన తర్వాత సీఎల్సీ-ఏపీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఎల్జీ పాలిమర్స్ ఉదంతంపై ఫేస్బుక్లో పోస్ట్ను షేర్ చేసినందుకు గుంటూరుకు చెందిన వృద్ధురాలు రంగనాయకమ్మపై కేసు పెట్టి, విచారించడం సహా రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పలు పరిణామాలపై వారిద్దరూ తమ అభిప్రాయాల్ని ఇలా వ్యక్తం చేశారు.
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే: ముప్పాళ్ల సుబ్బారావు
పాలనలో లోపాల్ని బహిర్గతం చేసినవారిని నామరూపాల్లేకుండా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తమ పార్టీకి అనుకూలంగా లేనివారిపై కేసులు పెడుతూ, దాడులకు పాల్పడుతోంది. ప్రతి చిన్న విషయానికీ ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టి.. ప్రభుత్వ విధానాలు, అధికార దుర్వినియోగంపై ఎవరూ నోరు మెదపకుండా భయభ్రాంతుల్ని చేస్తోంది. విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారమే దీనికి ఉదాహరణ. వైద్యుల భద్రత కోసం మాస్క్లు, శానిటైజర్లు ఇవ్వమని అడిగినందుకే ఆయనను సస్పెండ్ చేశారు. పిచ్చోడని ముద్ర వేసి దాడికి పాల్పడ్డారు.
వారిపైనా సుమోటోగా కేసులు పెట్టాలి
అధికారంలో ఉన్నవారిని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టినవారిపై కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నాయకులపై చేసిన నిందారోపణలు, వాడిన భాష అంతకంటే అభ్యంతరకరంగా ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అలాంటి ప్రజాప్రతినిధులపై సుమోటోగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయాలి. మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో తెచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టినా కేసులు పెట్టడం దానికి కొనసాగింపే. ఒక పక్షంపై వచ్చిన వార్తలు, పోస్ట్లపైనే చట్టాన్ని ప్రయోగించడం రాజ్యాంగ ఉల్లంఘనే.
ఆమెకు ఆ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మపై ఐపీసీలోని 505(2), 153(ఎ), 188, 120-బి సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం కేసులు పెట్టారు. వదంతులు వ్యాపింపజేయడం, మతం, భాష, వర్గం, జన్మస్థానం వంటి అంశాలు ప్రాతిపదికగా వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం, ప్రభుత్వాన్ని కూల్చేందుకు నేరపూరిత కుట్ర వంటి అభియోగాలు మోపారు. రంగనాయకమ్మ చర్య వీటిలో ఏ సెక్షన్ల కిందకూ రాదు. ఆ కంపెనీకి అనుమతుల్లేవనడం, నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకయిందనడం, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారనడం వాస్తవాలే కదా? ఆమె ఆ పోస్ట్ పెట్టడంలో ప్రభుత్వ ఆదేశాల ధిక్కరణ ఎక్కడుంది? ఆ పోస్ట్ వల్ల ఏమైనా అల్లకల్లోలం చెలరేగిందా? ఆ ఘటనపై ఇంకెవరూ మాట్లాడకుండా ఉండాలనే ఆమెపై కేసులు పెట్టారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులెవర్నీ అరెస్ట్ చేయకుండా, ప్రభుత్వం వారితో మంతనాలు సాగిస్తూ, ప్రశ్నించినవారిని అరెస్ట్ చేయడం దారుణమని సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.
పాలకుల్ని విమర్శిస్తే దేశ ద్రోహమేనా?- ఎస్.సుభాష్ చంద్రబోస్
భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం పౌరులకు భావప్రకటన స్వేచ్ఛను కల్పించింది. పత్రికలు, ప్రచురణ, ఉపన్యాసాలు ఇవ్వడం, మనోభావాల్ని ప్రకటించడం, సినిమాలు, పాటలు, నాటకాలు, కథలు, కవితలు, నృత్యాల ద్వారా తమ భావాల్ని, అభిప్రాయాల్ని వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని తోసిపుచ్చడానికి దుర్మార్గమైన చట్టాలు తేవడం ఎప్పటి నుంచో ఉంది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టినవారిపైనా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపైనా కేసులు పెట్టడం, వేధించడం దానిలో భాగమే. మాస్క్లు లేవన్నందుకు ఒక డాక్టర్ని సస్పెండ్ చేయడమే తప్పయితే.. ఆయన చూపించిన లోపాల్ని సరిదిద్దకుండా కేసులు పెట్టడం మరింత దారుణం. ప్రభుత్వం భయోత్పాతం సృష్టించేందుకు, తమ విధానాల్ని ప్రశ్నించినవారిని అణగదొక్కేందుకు పోలీసు వ్యవస్థను వాడుతోంది. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో దారుణంగా వ్యవహరించింది. ప్రతిపక్షాలవారిని నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమిస్తున్నవారిపై తప్పుడు కేసులు పెట్టింది. పోలీసులు.. ఆ సెక్షన్లలో ఏముందో కూడా చూడకుండా, ప్రభుత్వం చెప్పిందని కేసులు పెడుతున్నారు. 144, 30 సెక్షన్ల విధించడంపై డీజీపీ వెళ్లి హైకోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సెక్షన్లో ఏముందో చదవమని డీజీపీని కోర్టు ఆదేశించిదంటేనే పోలీసుల తీరు అర్ధమవుతోందని సీనియర్ న్యాయవాది ఎస్ సుభాష్ చంద్రబోస్ అన్నారు.
తామే రాజులమని అనుకుంటున్నారు
ప్రజలు తమను ఎన్నుకున్నారు కాబట్టి... విపక్షంలో ఉన్నవారిని, ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేవన్నవారిని ఏం చేసినా పర్వాలేదనే ధోరణి పాలకుల్లో పెరిగిపోయింది. తమను తాము రాజుల్లా భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టడం భావవ్యక్తీకరణ కిందకే వస్తుంది. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ఏం జరిగి ఉంటుందన్న అంశంపై రంగనాయకమ్మ చేసిన పోస్ట్లో పలు సాంకేతికాంశాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్న పోస్ట్లు... ప్రజల్ని ప్రభావితం చేసి, ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయంతోనే అణచివేయాలని చూస్తున్నారు. విమర్శల్ని సానుకూల దృక్పథంతో స్వీకరించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు.
ఇదీ చదవండి: విశాఖ దుర్ఘటనపై కేంద్ర రసాయన నిపుణుల కమిటీ పరిశీలన