ప్రకృతి విపత్తులు, పెట్టుబడుల కొరత, దళారుల బెడద... వ్యవసాయంలో అన్నదాతకు నిరంతరం సవాళ్లే. వీటి నుంచి గట్టెక్కించాలంటే వారూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఒకటే మార్గం. దీనికోసమే నా కృషి అంటున్నారు సికింద్రాబాద్కు చెందిన చింతల రమ్యప్రియ.
రైతులకు అండగా నిలిచేందుకు ‘భూమాత అగ్రి’ అంకుర సంస్థ స్థాపించారు. తనకున్న విజ్ఞానం, సృజనాత్మకత జోడించి ‘రామసేతు’ అనే మొబైల్ యాప్ రూపొందించారు. దీనిద్వారా నారు పోసిన దగ్గర నుంచి బియ్యం మిల్లింగ్ చేయించే వరకు ప్రతి సదుపాయాన్ని రైతుకు చేరువలో ఉంచుతుంది. వరి నాటే యంత్రాలు, కలుపు తీసే మిషన్లు, కోత యంత్రాలు రొటోవేటర్లు, ట్రాక్టర్లతో పాటు సంచార రైస్మిల్లు కూడా తక్కువ అద్దెకు చేరవేస్తున్నారు.
‘లాక్డౌన్ సమయంలో రైతుల కష్టాలు స్వయంగా చూశా. అప్పుడే ఈ యాప్ ఆలోచన వచ్చింద’ని చెబుతారు రమ్యప్రియ. వీరు అందిస్తున్న సౌకర్యాల్లో ఆసక్తికరమైంది మొబైల్ రైస్ మిల్లు. సాధారణంగా రైతు వరి పంట కోయగానే దళారులకు అమ్ముతాడు. లేదా మిల్లింగ్ కోసం తరలిస్తాడు. ఇక్కడైతే రైతు ఉన్న దగ్గరకు మొబైల్ రైస్ మిల్లు తరలివస్తుంది. దీని వల్ల ఖర్చుతో పాటు సమయం కూడా చాలా కలిసివస్తుంది.
ఇదీ చూడండి :