జస్టిస్ రజనీ న్యాయమూర్తిగా అందించిన సేవలు అందరికి ఆదర్శప్రామయని హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరీ అన్నారు. ఆమె అందించిన న్యాయసేవలను కొనియాడారు. ధైర్యవంతురాలని ప్రశంసించారు. కుటుంబసభ్యుల సహకారం ఆమెకు ఉందని గుర్తుచేశారు. పలు కీలక కేసుల్ని సత్వరం విచారించి పరిష్కరించారని చెప్పారు. న్యాయవ్యవస్థ ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జస్టిస్ రజనీ అన్నారు. చట్ట నిబంధనలను పాటిస్తూ మావవత్వంతో ఆత్మసాక్షిగా తీర్పులివ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు.
18 ఏళ్ల సుదీర్ఘ న్యాయవ్యవస్థ ప్రయాణంలో సహకరించిన వారికి జస్టిస్ రజనీ ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందన్నారు. తల్లిదండ్రులు, సోదరి అందించిన తోడ్పాటును తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరీ, ఇతర న్యాయమూర్తులు జస్టిస్ రజనీకి షష్పగుచ్ఛం ఇచ్చి కుటుంబసభ్యులకు జ్ఞాపికను అందజేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్ రజనీ 1980లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. తర్వాత న్యాయవాదిగా పేరు సమోదు చేసుకొని ప్రాక్టీసు ప్రారంభించారు. 2002 ఆగస్టులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. కరీంనగర్లో రెండో, మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. హైదరాబాద్లోని మహిళా కోర్టు జడ్జిగా, ఆర్థిక నేరాల కోర్టు జడ్జిగా సేవలు అందించారు. మెదక్ జిల్లా జడ్జిగా పనిచేశారు. హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా సేవలు అందించారు. 2017 జనవరి 17న ఏపీ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండీ... కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే