ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి(Pushpa Srivani) కుల ధ్రువీకరణ విషయంలో ‘అప్పీల్ అథార్టీ’ విచారణకు సంబంధించి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విచారణలో న్యాయవాది బి.శశిభూషణ్రావు వాదనలు వినిపిస్తూ.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణ పత్రం వాస్తవికతను తేల్చాలని న్యాయవాది రేగు మహేశ్వరరావు (పిటిషనర్) పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్నారు. దానిని కలెక్టర్ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీకి పంపించారని చెప్పారు. పుష్పశ్రీవాణి ఎస్టీయే అని ఆ కమిటీ మే 9న ఉత్తర్వులిచ్చిందన్నారు. వాటిపై పిటిషనర్ జూన్ 10న అప్పీల్ దాఖలు చేశారని తెలిపారు.
‘చట్టప్రకారం అప్పీల్ విచారణ పరిధి గిరిజన శాఖ మంత్రికి ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి గిరిజన శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో అప్పీల్పై ఆమే విచారణ చేయడం చట్టానికి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో ఏపీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథార్టీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించండి’ అని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ పత్రాలను పరిశీలిస్తే.. ఛైర్మన్/ గిరిజనశాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర స్థాయి పునఃసమీక్ష కమిటీ) వద్ద అప్పీల్ దాఖలు చేసినట్లు ఉందన్నారు. అప్పీల్ను ఉపసంహరించుకొని సంబంధిత అథార్టీ ముందు దాఖలు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి..
జల్శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ