ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో పుట్టింది రోషన్. ఉత్తర్ప్రదేశ్లోని అజంగఢ్ వీరి స్వస్థలం. పొట్టకూటికోసం వలసొచ్చింది ఆ కుటుంబం. తండ్రి వీధివీధికీ తిరిగి కాయగూరలు అమ్ముతారు. తల్లి గృహిణి. కూతురిని పెద్ద చదువులు చదివించాలనుకున్నారా దంపతులు. రోషన్ ఆశయం డాక్టరవ్వాలని. పదోతరగతిలో ర్యాంకు తెచ్చుకుని, ఇంటర్లో బైపీసీ తీసుకుంది. బాంద్రాలో కాలేజీ. లోకల్ ట్రైన్లో వెళ్లి వచ్చేది.
అలా పోగొట్టుకుంది
అక్టోబరు7, 2008. పరీక్షలు మొదలయ్యాయి. ఆ రోజు తిరిగొస్తున్న రోషన్ మనసంతా పరీక్షలపైనే ఉంది. రైలు జోగేశ్వరి స్టేషన్కు చేరుకుంటోంది. రోషన్ సీటులోంచి లేచి దిగడానికి సిద్ధమైంది. అంతలో తొక్కిసలాట. ఏం జరిగిందో తెలిసేలోపే రైలు నుంచి జారి పడిపోయింది. స్పృహ వచ్చాక చూసుకుంది. పట్టాలపై పడి ఉన్నానని తెలిసి షాక్కు గురైంది. రెండు కాళ్లూ రక్తపు మడుగులో ఉన్నాయి. శరీరమంతా భరించలేని నొప్పి. సాయం కోసం చూస్తూ, క్షణాన్ని ఓ యుగంలా గడిపింది. తన వద్దకు వచ్చిన కొందరిని సాయమడిగింది. ఒక్కరూ స్పందించలేదు. అంత బాధలోనూ బ్యాగులోని ఫోన్ నంబర్ల పుస్తకాన్నిచ్చి, వాళ్ల అమ్మకు ఫోన్ చేయమని కోరింది. ఎవరూ ముందుకు రాలేదు. మంచినీళ్లు కావాలని అడిగితే ఒక్కరూ గొంతు తడపలేదు. రక్తపుమడుగులో నొప్పితో విలవిల్లాడుతూ సాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. అరగంట తరువాత వచ్చి రైల్వే పోలీసులు రోషన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తరలించేటప్పటికి అక్కడ వైద్యుల సమ్మె జరుగుతోంది. దాంతో వెంటనే చికిత్స అందలేదామెకు.
ఏడుగంటలు నరకయాతన
‘ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగితే సాయంత్రం ఆరు వరకూ వైద్యం చేయలేదు. అమ్మానాన్నా వచ్చే సరికి ఆస్పత్రి కారిడార్లో పడి ఉన్నా. కాళ్లు రెండూ స్పర్శ కోల్పోయాయి. నన్ను చూసి వాళ్ల గుండె బద్దలైపోయింది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒక కాలు తొడ భాగం కింద నుంచి, మరొకటి మోకాలి నుంచి నుజ్జునుజ్జు అయిపోయాయి. ఆ భాగాల్ని తొలగించారు. డిశ్చార్జి తర్వాత చిన్నచిన్న అవసరాలకూ అమ్మే ఆధారం. అది తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ఇక నాకు జీవితం లేదనుకున్నా. డాక్టరునై, పేదలకు సాయం చేయాలనే నా ఆశలు అడియాసలే అనుకున్నా. వాష్రూంకు కూడా అమ్మ భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లేది. పరామర్శించే వాళ్ల సానుభూతి దారుణంగా ఉండేది. రోజంతా ఏడుస్తూనే ఉండేదాన్ని. అమ్మ ఒక్కటే చెప్పింది. ‘నీకు కాళ్లు మాత్రమే లేవు, కళ్లు, చేతులు, మిగతా శరీరం, మెదడు అన్నీ ఉన్నాయి. నీ లక్ష్యాన్ని సాధించడానికి ఇవి సరిపోవా’ అని ధైర్యం నూరిపోసింది. అప్పుడు ఆలోచించా... భగవంతుడు ఇంతటి కష్టాన్నిచ్చికూడా బతికించాడూ... అంటే నేనేదో సాధించడానికే అనుకున్నా. తిరిగి చదువుకోవాలనుకున్నా’.
-డాక్టర్ రోషన్
కాళ్లు లేకపోతే చదవలేమా?
ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక రోషన్ మంచంపై ఉంటూనే ఇంటర్ పరీక్షలకు చదివింది. కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేసుకుని నడవడం నేర్చుకుంది. ఆ పరీక్షలో అత్యుత్తమ మార్కులూ సాధించింది. మెడికల్ కాలేజీలో చేరడానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి దివ్యాంగుల కోటాలో మూడో ర్యాంకు తెచ్చుకుంది. అయితే ఎంబీబీఎస్లో సీటు ఇవ్వడానికి కాలేజీ నిరాకరించింది. సాధారణంగా 40 శాతంలోపు వైకల్యం ఉన్న వారికి మాత్రమే వైద్యకోర్సు చదవడానికి చట్టపరంగా అనుమతి ఉంటుందన్నారు. రోషన్కు 89 శాతం వైకల్యం ఉండటం ఆటంకంగా మారింది. రోషన్ పట్టువీడలేదు. కాళ్లు లేకపోవడం చదువుకు ఎలా అడ్డంకి అవుతుందని ప్రశ్నిస్తూ, న్యాయం చేయాలని ముంబయి న్యాయ స్థానం గడప తొక్కింది. చేతి కర్రలతో న్యాయస్థానానికి వచ్చిన రోషన్ పట్టుదలను చూసిన చీఫ్ జస్టిస్ మోహిత్షా ఆమెకు సీటివ్వాల్సిందిగా తీర్పు చెప్పారు. అలా 2011లో దేశంలోనే అత్యుత్తమ వైద్యకళాశాల ‘సీజేఎస్ మెడికల్ కాలేజీ ఆఫ్ కేఎం హాస్పిటల్’లో చేరింది. కోర్సులో భాగంగా ఊత కర్రలతో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలో నిరంతరాయంగా 15 గంటలకు పైగా విధులు నిర్వహించేది. అలా 2016లో ఎంబీబీఎస్లో బంగారుపతకాన్ని సాధించింది. ఆ ఏడాది మహిళా దినోత్సవాన ముంబయి కోర్టు న్యాయమూర్తి, న్యాయవాదుల చేతుల మీదుగా సత్కారాన్ని అందుకుంది డాక్టర్ రోషన్.
స్ఫూర్తి ప్రసంగాలతో
రోషన్ విజయాలను చూసి చాలామంది తామూ స్ఫూర్తి పొందుతున్నామని ప్రశంసించేవారు. ఆ స్ఫూర్తిని మరి కొంత మందిలో నింపాలనే ఆలోచన వచ్చింది రోషన్కు. పట్టాల మీద పడి ఉన్న తనకు ఎవరూ సాయం చేయలేదనే కోపం లేదామెకు. పైగా నిరాశ నిస్పృహల్లోకి జారిపోయే వారికి తన ప్రసంగం ఓ ఉత్సాహాన్ని, పట్టుదలను ఇవ్వాలని ఆశించింది. కాలేజీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు తన గురించి చెప్పడం మొదలుపెట్టింది.
ఉన్నత విద్యాభ్యాసం
రోషన్ కష్టాలు ఇంతటితో ముగియలేదు. ఎండీ చేయడానికి ప్రవేశపరీక్ష రాసి ప్రథమ ర్యాంకు తెచ్చుకున్నా సీటివ్వలేదు. వైకల్యమే సమస్యగా చూపించారు. ఆమె తిరిగి పోరాటాన్ని మొదలు పెట్టింది రోషన్. కేంద్రమంత్రికి ఈ విషయంపై లేఖ రాసింది. ఫలితంగా ఆమె లక్ష్యం, పట్టుదల గురించి పార్లమెంటులోనే చర్చ జరిగింది. దాంతో 89 శాతం వైకల్యం ఉన్నవారు ఎండీ చేయడానికి అర్హులేనంటూ కొత్త ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలా ఎంబీబీఎస్ పూర్తిచేసిన కళాశాలలోనే 2019లో పాథాలజీలో చేరడానికి సీటు దక్కించుకుంది డాక్టర్ రోషన్. ప్రస్తుతం ఎండీ చేస్తున్న ఈమె ఇదంతా తన తల్లి అందించిన చేయూతే అంటుంది.
డాక్టర్ రోషన్ ప్రతిభ, ఆత్మవిశ్వాసానికి పలు అవార్డులూ వరించాయి. 2018లో ఉత్తమ మహిళగా రోషన్కు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవార్డు అందించి, ‘లక్ష్యాన్ని సాధించడానికి వైకల్యం అడ్డు కాదు అనేందుకు రోషన్ ఓ ఉదాహరణ’ అంటూ ప్రశంసలు కురిపించారు. 50కిపైగా విద్యాసంస్థల్లో రోషన్ చేసిన ప్రసంగాలతో వేల మంది స్ఫూర్తి పొందారు. టెడెక్స్ వంటి వేదికలపైనా రోషన్ వక్తగా మారింది.
ఇదీ చదవండి: విషాదం: ఏనుగు దాడిలో యువరైతు మృతి