వైద్య పరికరాల సరఫరాకు సంబంధించిన బకాయిలు చెల్లించాలంటూ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీకి వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయాలంటూ సదరు అసోసియేషన్ సామాజిక మాధ్యమాల్లోనూ , వెబ్ సైట్లోనూ ఉంచిన రెడ్ నోటీసుపైనా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పోరేషన్ లేఖ రాసింది. అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టమైన వివరాలు లేవంటూ ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి అందులో పేర్కోన్నారు. 4-5 ఏళ్లుగా ఏపీ చెల్లింపులు చేయలేదంటూ అసోసియేషన్ సభ్యులు చేసిన ఆరోపణలు సరికావని రాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది. గడచిన రెండేళ్లలో కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు 2 వేల కోట్లను చెల్లించామని ఏపీఎస్ఎంఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్-19కి సంబంధించి గత రెండు నెలల్లో కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు 328 కోట్ల రూపాయల బిల్లులు మాత్రమే బకాయిలు ఉన్నాయని అందులో పేర్కోన్నారు.
మరోవైపు సామాజిక మాధ్యమాలు, అసోసియేషన్ వెబ్ సైట్ లో ఉంచిన రెడ్ నోటిసుపై విచారణ చేయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ అసోసియేషన్కు రాసిన లేఖలో పేర్కోంది. దురుద్దేశపూర్వకంగా ఈ పోస్టులు ఉన్నట్టు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాన్ని అంగీకరించబోమని అసోసియేషన్ కు రాసిన లేఖలో వెల్లడించింది.
ఇదీ చదవండి: Kannababu: ఈ-క్రాప్ ద్వారా పంట నష్టపోయిన రైతులను గుర్తించాలి: కన్నబాబు