కరోనా రెండో దశ ఉద్ధృతితో.. టీకా తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. అయితే.. అవసరాన్ని బట్టి రాష్ట్రానికి 30లక్షల డోసులు కావాలని.. ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లేఖ రాశారు. అయితే 12వ తేదీకి కేంద్రం 2.6 లక్షల కోవిశీల్డ్, 2లక్షల కోవాగ్జిన్ కలిపి మొత్తం 4.6లక్షల వ్యాక్సిన్ డోసులు పంపింది. ఫలితంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోయాయి. అందువల్ల ఆదివారం వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడనుంది.
రాష్ట్రానికి ఇప్పటివరకు 31 లక్షల 38 వేల 990 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. అందులో శుక్రవారం నాటికి 28 లక్షల 97వేల 90 టీకాలు వినియోగించారు. అయితే.. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత పెరగుతుండటంతో.. టీకా తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఐదురోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 6 లక్షల 36 వేల 117 డోసులు పంపిణీ చేశామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కేవలం శుక్రవారం రోజునే రికార్డు స్థాయిలో లక్షా 68 వేల 383 మందికి టీకాలు అందించామని వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయని వివరించారు. ఆదివారం సాయంత్రానికి కేంద్రం నుంచి 2.6 లక్షల వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని శ్రీనివాసరావు తెలిపారు.
ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే టీకాలు రెండు రోజులకంటే ఎక్కువ సరిపోవని అధికారులు భావిస్తున్నారు. కనీసం వారానికి సరిపడా వ్యాక్సిన్ డోసులు కేంద్రం పంపితే తప్పా.. నిరంతయరాయంగా ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపించటం లేదని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: