రాష్ట్రంలో విద్యుత్తు ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో పని చేసే సిబ్బందికీ వాయిదా పద్ధతిలో వాహనాలను ఇచ్చే విషయాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్క్యాప్) పరిశీలిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వాహనాలను అందించే ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనిని ప్రారంభించనున్నారు. అలాగే మౌలికసదుపాయాల అభివృద్ధిలో భాగంగా నగరాల్లో ఛార్జింగ్ కేంద్రాలు, మెకానిక్లకు నైపుణ్య శిక్షణ అందించాలని నెడ్క్యాప్ భావిస్తోంది.
ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. ఇక విద్యుత్తు వాహనాలకు రహదారి పన్ను (రోడ్ ట్యాక్స్)ను ప్రభుత్వం పూర్తిగా మినహాయించింది. దీనివల్ల సుమారు రూ.6 వేల వరకు కొనుగోలుదారులకు లబ్ధి చేకూరుతుంది. కేవలం రవాణాశాఖ కార్యాలయంలో రూ.400 నామమాత్ర ఛార్జీలు చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది. 25 కి.మీల గరిష్ఠ వేగంతో వెళ్లే వాహనాలను నడపటానికి డ్రైవింగ్ లైసెన్సు అవసరం ఉండదు.
మౌలిక సదుపాయాల కల్పన
* వాహనాల మరమ్మతుల కోసం ప్రతి జిల్లా నుంచి 300 మంది మెకానిక్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. నిర్దేశిత ఛార్జీలను వాహన తయారీ సంస్థలే మెకానిక్లకు చెల్లిస్తాయి.
* ప్రధాన నగరాల్లో కనీసం 50 మానవ రహిత ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనుంది. విజయవాడ, విశాఖల్లో వాహన తయారీ సంస్థలే వాటిని ఏర్పాటు చేస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, ఒకే సంస్థ కనీసం 20 వాహనాలను కొనుగోలుచేస్తే ఆ సంస్థ ఆవరణలోనూ ఈ కేంద్రాలు ఉంటాయి. యూనిట్కు రూ.5.75 వంతున ఛార్జీలను విద్యుత్తు సంస్థలు వసూలు చేస్తాయి.
* ముఖ్య నగరాల్లో బ్యాటరీ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆటోలకు బ్యాటరీలను అందించడానికి ఇటువంటి మానవరహిత కేంద్రాలు ఇప్పటికే విజయవాడ, విశాఖ నగరాల్లో ఉన్నాయి. ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీలను ఈ కేంద్రాల్లో జమచేసి.. నిర్దేశిత ఛార్జీలను ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లించి కొత్త బ్యాటరీ తీసుకెళ్లాలి. ద్విచక్ర వాహనాలకు ఈ కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. దీని వల్ల ఛార్జింగ్ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని నెడ్క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: