Cyber Crime: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలో నివాసముండే 50 ఏళ్లు దాటిన వ్యక్తి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మ్యాట్రిమోని సైట్లో తన ప్రొఫైల్ పెట్టారు. ఇది జరిగిన రెండో రోజే ఓ అమ్మాయి డీపీతో ఉన్న ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానికి అంగీకరించారు. మీరు నచ్చారు. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదువుతున్నట్లు చెప్పి ఫీజు కట్టాలని, కొవిడ్ వచ్చిందని.. ఇలా పలు కారణాలతో మొత్తం రూ.46 లక్షలు లాగేసింది. ఆ తర్వాత.. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని రూ.10.50 లక్షలు: కవాడిగూడకు చెందిన తోడల్లుళ్లు తమ ఇద్దరి పిల్లలకు నీట్లో మంచి ర్యాంక్ రాక ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. మీ పిల్లలకు రాయ్చూర్లో సీట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఫోన్ చేసి నమ్మించాడు. దీంతో తోడల్లుళ్లు రెండు సీట్లకు రూ.10.50లక్షలు పంపించేశారు. మరుసటి రోజే రాయ్చూర్లోని ఓ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా లెటర్లు వచ్చాయి. అక్కడకు వెళ్లగా నకిలీవని తేలింది. బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.