కరోనా ప్రభావంతో వివాహ వేడుకకు అర్థమే మారిపోయింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో పరిణయ వేడుక పరిమిత కుటుంబసభ్యుల సమక్షంలోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే తెలంగాణ వాసులు సరిహద్దు చెక్పోస్టు గుండా ప్రవేశించాల్సిందే. ఇలా పరిమిత సంఖ్యలో వెళ్లి వివాహ వేడుక చేసుకుని వస్తున్న నూతన జంటలకు చెక్పోస్టుల వద్ద వివరాలు నమోదు చేయించుకుంటున్నారు.
తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు చెక్పోస్టు వద్ద రెండు నూతన జంటలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఉండవల్లి మండలం మారుమునగాలకు చెందిన జంటకు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో వివాహం జరిగింది. మరొకరు మల్దకల్ మండలం పెద్దొడి గ్రామానికి చెందిన జంట కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలుకా గోవిందపల్లి గ్రామంలో పెళ్లి చేసుకుని వచ్చారు. చెక్పోస్టు వద్ద ఉన్న అధికారులు... నూతన వధూవరులు, కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు.
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం