రాష్ట్రంలో కొత్తగా 147 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఒకరు కొవిడ్ మహమ్మారికి బలి అయ్యారు. కొత్తగా 103 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని.. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వందల 43 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో మంత్రి ఆళ్ల నాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులకు మెడికల్ కిట్లు అందజేయాలని సూచించారు.
కృష్ణా జిల్లాలో చర్యలు..
తెనాలిలో కొవిడ్ నిర్ధరణ అయిన పురపాలిక సిబ్బందిని హోం క్వారంటైన్లో ఉంచాలని స్పష్టం చేశారు. ప్రాథమిక, సెకండరీ కాంటాక్టు వ్యక్తులకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పొన్నూరులోని ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా.. వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలని.. ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టాలని మంత్రి సూచించారు.
జగ్గయ్యపేటలో కరోనా బాధితులను హోం క్వారంటైన్కు తరలించామని.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 40 మందికి ప్రత్యేకంగా వైద్య సదుపాయం అందిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.
గుంటూరు జిల్లాలో చర్యలు..
పిడుగురాళ్లలోనూ కరోనా కేసులు పెరగటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో చర్యలు..
తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమలోనూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మల్కిపురం జిల్లా పరిషత్ పాఠశాలలో 12మందికి వైరస్ నిర్ధరణ కావటంపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. విద్యార్థులను హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొందరు ఉపాధ్యాయులకూ వైరస్ సోకటంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించి జిల్లాకు వస్తున్నవారిలో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని.. రేపూరులో కాశీయాత్రకు వెళ్లి వచ్చిన ఓ కుటుంబానికి కొవిడ్ సోకటంతో అక్కడ రెడ్జోన్గా ప్రకటించామని అధికారులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో చర్యలు..
తిరుమల వేదపాఠశాలలో మరో 10 మందికి కరోనా సోకటంతో.. మొత్తం కేసుల సంఖ్య 67కు పెరిగింది. గతవారం 57 మందికి కరోనా నిర్ధరణ కావటంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. విద్యార్థులు, బోధనా సిబ్బంది సహా 75 మందికి తాజాగా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కొవిడ్ నిర్ధరణ అయింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి పోలీసుల ఆర్థిక సహాయం