దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా చేపడుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ(Compressed Bio Gas Plant in Hyderabad)) ఉత్పత్తికి భాగ్యనగరంలోని జవహర్నగర్ డంపింగ్యార్డు వేదికైంది. దాదాపు 130 ఎకరాల్లో పేరుకుపోయిన చెత్త నుంచి వెలువడే వాయువుల నుంచి బయో గ్యాసు ఉత్పత్తి చేసే అతిపెద్ద ప్లాంటును రామ్కీ సంస్థ బుధవారం ఆవిష్కరించింది.
ఇక్కడి చెత్తకుప్పలపై క్యాపింగ్ సమయంలో 155 బోర్లు వేశారు. వాటి నుంచి పైపులైన్ ద్వారా చెత్తలోని వాయువులను నింపేందుకు ఓ రెండు పెద్ద బెలూన్లను ఏర్పాటు చేశారు. మొదటి బెలూన్లోకి మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు చేరిన తర్వాత వాటిని శుద్ధి చేసి కేవలం మీథేన్ మాత్రమే మరో బెలూన్లోకి చేరే ఏర్పాట్లు చేశారు. దీన్ని కంప్రెస్డ్ బయో గ్యాస్గా మార్చి బూస్టర్ కంప్రెషర్ ద్వారా పైపులైన్ల నుంచి సిలిండర్లలో నింపుతారు.
సీబీజీ(Compressed Bio Gas Plant in Hyderabad) విక్రయానికి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నారు. 5టన్నుల దాకా సీబీజీ ఉత్పత్తి చేయగల అతిపెద్ద ప్లాంటు ఇదే కావడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ కేంద్రం నుంచి రోజుకు 2 టన్నుల సీబీజీ ఉత్పత్తి కానుంది. దీన్ని సిలిండర్లలో నింపి వాహనాల్లో వినియోగించనున్నట్లు రామ్కీ ఎన్విరో జేఎండీ మసూద్ మల్లిక్ వెల్లడించారు.
ఇదీ చదవండి: అభ్యంతరకర పోస్టులను తొలగించేందుకు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు : హైకోర్టు