గృహనిర్మాణాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన జాయింట్ కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పెద్దఎత్తున గృహనిర్మాణాలు చేపట్టేందుకు కారణాలు, సహా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామన్న ముఖ్యమంత్రి... 17వేల లేఅవుట్లలో ఈ ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొన్ని లేఅవుట్లు మున్సిపాల్టీల సైజులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లను గతంలో దేశంలో ఎప్పుడూ కట్టలేదని వ్యాఖ్యానించారు.
విశేషంగా పనిచేస్తున్నారు..
అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారన్న సీఎం జగన్.. నిర్ణీత సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలన్నారు. అవినీతి, పక్షపాతం లేకుండా ఇంటి పట్టాలు అందాలని చెప్పారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
శాచ్యురేషన్ పద్ధతిలో...
అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో అర్హులైన వారికి సామాజిక తనిఖీ చేసి శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలుగుతున్నామని... ఎవరైనా మిగిలిపోతే, వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందాలని చెప్పారు. ఏటా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లు ఇవ్వాలన్నారు. పేదవాడి సొంతింటికలను నిజంచేసే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
90 రోజుల్లోగా పట్టా...
ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్దన్నారు. అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈమౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు అత్యంత ప్రాధాన్యతా అంశమని ఉద్ఘాటించారు.
మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34వేల కోట్లు
ఇళ్లస్థలాలు, నిర్మాణం, మౌలిక సదుపాయాల రూపేణా సుమారు రూ.84వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం స్పష్టం చేశారు. అవినీతికి తావు ఉండకూడదని, ప్రతి పనిలోనూ పారదర్శకత, నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. నాణ్యత విషయలో రాజీపడితే ఇబ్బందులు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, దీనికోసం సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలని దిశానిర్దేశం చేశారు. పనిలో ఎక్కడా డూప్లికేషన్ ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... నూతన విద్యా విధానం, అంగన్వాడీల్లో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష