పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం వాయిదా వేసిందని.. దీనిపై జూలైలో నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) సుమన్ హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. స్కూల్స్ రీఓపెనింగ్, పది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమౌతోందన్న పిటిషనర్ మాటల్లో నిజం లేదన్నారు. వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేసిన హైకోర్టు.. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలోని పాఠశాలల పునఃప్రారంభం, పదో తరగతి పరీక్షల నిర్వహణకు ముందు ఉపాధ్యాయులందరికీ కొవిడ్ టీకా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టీచర్లకు వ్యాక్సిన్ ఇవ్వకుండా జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి, జూన్ 7 నుంచి పది పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని కోరారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తితో రాష్ట్రవ్యాప్తంగా 400మంది ఉపాధ్యాయులు మృతి చెందినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది పొత్తూరి సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇచ్చాకే స్కూల్స్ ప్రారంభించాలన్నారు. అప్పుడే పది పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా కేంద్రం గుర్తించలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఉపాధ్యాయులందరికీ టీకా వేయటం కుదరదన్నారు.
ఇదీ చదవండి: అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి : మంత్రి రామచంద్రారెడ్డి