రాష్ట్ర ఉప ఖజానా కార్యాలయాల్లో మరో కుంభకోణం వెలుగుచూసింది. టీడీఎస్ మినహాయించిన సొమ్ముల కంటే అదనంగా క్లెయిమ్ చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. సాధారణంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు తాము కట్టాల్సిన సొమ్ము కంటే అదనంగా చెల్లించినప్పుడు, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకునే (క్లెయిమ్) వెసులుబాటు ఉంటుంది. అయితే బోగస్ క్లెయిమ్లతో కొందరు భారీగా సొమ్ములు రాబట్టినట్లు ఖజానా అధికారుల పరిశీలనలో బయటపడింది. కేరళలోని కోజికోడ్లో జరిగిన ఓ కుంభకోణం ఆధారంగా దేశవ్యాప్తంగా డేటాను పరిశీలిస్తుండగా ఈ అక్రమం వెలుగుచూడటం విశేషం.
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఉప ఖజానా కార్యాలయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో సమకూరిన ఆదాయపు పన్ను రూ.2.10 కోట్లు మాత్రమే. ఇక్కడ రిటర్నులు సమర్పించాక అధిక మొత్తం చెల్లించామంటూ వెనక్కి తీసుకున్న సొమ్ము ఏకంగా రూ.25.83 కోట్లు. అంటే రూ.23.73 కోట్ల మేర కుంభకోణం జరిగింది. అంతకుముందు ఏడేళ్లుగా ఏం జరిగిందో కూడా ఖజానా అధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమహేంద్రవరం, కొత్తపేట, పాలకొల్లు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, వాల్మీకిపురం ఉప ఖజానా కార్యాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. చివరికి లెక్కలు తేలేసరికి ఐటీ శాఖకు ఎంత టోకరా వేశారో అంచనాకు రాగలమని చెబుతున్నారు.
ఇలా బయటపడింది: కేరళలో ఈ తరహా కుంభకోణం తొలిసారి వెలుగుచూసింది. బోగస్ రిఫండ్ క్లెయిమ్లు దాఖలు చేసి, అకౌంట్స్ ఆఫీసు ఐడెంటిఫికేషన్ నంబరు (ఏఐఎన్)ను దుర్వినియోగం చేసి పెద్దమొత్తంలో నిధులు కాజేసినట్లు గుర్తించారు. దీంతో ఆదాయపు పన్నుశాఖ కోజికోడ్ జాయింట్ కమిషనర్ దేశవ్యాప్తంగా అనేక ఏఐఎన్లను పరిశీలించారు. అనుమానంగా ఉన్న ఏఐఎన్లను పరిశీలించి 2021 డిసెంబరు 21న ఓ నివేదిక సిద్ధం చేశారు. అందులో తంబళ్లపల్లెకు చెందిన ఏఐఎన్తో జరిగిన ఐటీ రిటర్నుల లావాదేవీలపై అనుమానం వ్యక్తమైంది. ఇక్కడ ఏడేళ్లుగా నమోదైన రిటర్నుల మొత్తానికి, 2020-21లో రిటర్నుల మొత్తానికి భారీ వ్యత్యాసం కనిపించడంతో అనుమానించి నివేదికలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆ నివేదిక ఆధారంగా కూపీ లాగగా ఏపీలోనూ బోగస్ క్లెయిమ్ల కుంభకోణం వెలుగుచూసింది.
ఏఐఎన్తోనే అక్రమాలు: పే అండ్ అకౌంట్స్, జిల్లా ఖజానా, ఉపఖజానా శాఖల్లో అధికారులందరికీ ఏఐఎన్ ఉంటుంది. ఆ నంబరుతోనే ప్రతినెలా ఎంత టీడీఎస్ మినహాయించారో 24-జీ స్టేట్మెంటు ఫారం నింపి ఐటీ శాఖకు సమర్పిస్తుంటారు. రిటర్నులు సమర్పించేందుకు కూడా అదే ఏఐఎన్ను వినియోగిస్తారు. అయితే తాము ప్రైవేటు ఆడిటర్లతో రిటర్నులు సమర్పిస్తున్నామని, వారికి తమ ఏఐఎన్ ఇస్తున్నామని ఖజానా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆడిటర్ల వల్లే ఈ అక్రమాలు జరిగి ఉంటాయని ఎస్టీవోలు వాదిస్తున్నా.. అలా తప్పించుకునేందుకు వీల్లేదని తెలుస్తోంది. క్లెయిమ్ల సొమ్ము పొందేందుకు బోగస్ టాన్ నంబర్లు, పాన్ నంబర్లు ఉపయోగించినట్లు సమాచారం. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, వాల్మీకిపురం ఎస్టీవో కార్యాలయాల నుంచి కొత్త ఏఐఎన్లు కేటాయించాలంటూ ఆదాయపు పన్నుశాఖకు అభ్యర్థనలు వెళ్లాయి. ఐటీ శాఖ వాటిలోని నిజాలను నిర్ధారించుకునేందుకు ప్రయత్నించగా తామెవరమూ కొత్త నంబరు కోసం దరఖాస్తు చేయలేదని అక్కడి ఎస్టీవోలు పేర్కొన్నారు. దీంతో ఫోర్జరీ సంతకాలతోనూ కొన్ని అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నారు.
తంబళ్లపల్లెలో ఓ సీనియర్ అకౌంటెంటు.. ప్రైవేటు ఆడిటర్తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డట్లు తెలిసింది. ఆ ఉద్యోగి తిరుపతిలో ఐటీ అధికారులను కలిసి వాంగ్మూలం కూడా ఇచ్చినట్లు సమాచారం. సొమ్ము మొత్తాన్ని అక్రమంగా మళ్లించేందుకు తానే కారకుడినని అంగీకరిస్తూ రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తానని హామీపత్రం రాసిచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 21 వరకు సెలవుపై వెళ్లిన ఆ ఉద్యోగి ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియదు. ఆ చిరుద్యోగి పెద్ద మొత్తంలో కొందరు ఎస్టీవోలు, ఒక జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఖాతాకు సొమ్ము బదిలీ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వారి నుంచి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఖాతాల్లో సొమ్ములు పడ్డ ఎస్టీవోల్లో ప్రస్తుతం భయం పట్టుకుంది.
ఇవీ చదవండి: