ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీపై కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన బొల్లిపల్లి శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ గురువారం తెలిపారు. అరకు ఎంపీ జి.మాధవి భర్తపై హైకోర్టులో తాను వేసిన కేసును ఉపసంహరించుకోవాలని శివాజీ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈనెల 2న ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో శాంతకుమారి ఫిర్యాదు చేసిందని ఎస్సై చెప్పారు. ఈ మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కమిషనరేట్కు పంపామన్నారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరి పోలీస్స్టేషన్కు ఆ ఎఫ్ఐఆర్ను బదిలీ చేశారని వెల్లడించారు.
సంఘటన ఎక్కడ జరిగిందన్నది నిమిత్తం లేకుండా ఒక వ్యక్తి వచ్చి తనకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు దానిని స్వీకరించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ తరవాత ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపుతారు.
ఇదీ చదవండి: