పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా తమ సమస్య పరిష్కారం కాలేదని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు నిజామాబాద్ రైతులు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరగాలని ప్రధాని మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 50 మంది రైతులు ఈరోజు నిజామాబాద్ నుంచి వారణాసికి బయలుదేరారు.
పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యం
ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, స్వచ్ఛందంగా పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. రాహుల్, మోదీలకు వ్యతిరేకంగా నిలవడం తమ ఉద్దేశం కాదని.. జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరిగితే.. పసుపు బోర్డు ఏర్పాటవుతుందనే ఆశతోనే పోటీ చేస్తున్నామన్నారు.
విమర్శించే బదులు పరిష్కరించండి
కొందరు నేతలు నామినేషన్ వేయడానికి వెళ్తున్న రైతులకు భూమి లేదని, పంట పండించరని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందారు. తమపై ఆరోపణలు చేసే బదులు సమస్య పరిష్కరిస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వాపోయారు.
నిజామాబాద్- తమిళనాడు 50-50
నిజామాబాద్ నుంచి 50 మంది, తమిళనాడు నుంచి మరో 50 మంది నామినేషన్ వేయడానికి బయల్దేరుతున్నారు. ఈనెల 27న కొందరు, 29న మరికొంత మంది నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని వారు కోరారు.
ఇదీ చూడండి: దరఖాస్తు చేసినవారికి డబ్బు వాపస్: ఇంటర్బోర్డు