లష్కరే తొయిబా ముష్కరుడిని గొడ్డలితో నరికి చంపిన జమ్ము కశ్మీర్ మహిళ రుక్సానా కౌసర్ సాహసం బాలీవుడ్ తెరపై కనిపించనుంది. ఆమె జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్ము కశ్మీర్కు చెందిన రుస్కానా.. 13 ఏళ్ల క్రితం లష్కరే ముష్కరులపై విరుచుకుపడింది. ముగ్గురు ఉగ్రవాదులపై దాడి చేసింది. అబూ ఉసామా అనే ఉగ్రవాదిని గొడ్డలితో నరికి చంపేసింది. అతడి వద్ద ఉన్న రైఫిల్ను తీసుకుని కాల్పులు చేసింది. ఈ కాల్పులలో మరో టెర్రరిస్టుకు గాయాలయ్యాయి. ఇది చూసిన మూడో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. 27 సెప్టెంబరు 2009న రాత్రి ఈ ఘటన జరిగింది. రుక్సానా సాహసానికి గాను అనేక ప్రశంసలు అందుకుంది. ఆ రోజు రాత్రి టెర్రరిస్టును చంపిన తరువాత భారతదేశం అంతటా ఆమె పేరు మారుమోగింది. ఈటీవీ భారత్తో మాట్లాడిన రుక్సానా.. అప్పటి ఘటనను గుర్తు చేసుకుంది.
![Movie the brave girl Rukhsana Kausar who killed a terrorist with an axe in Jammu and Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17154556_gfjngfnj.jpg)
"షహదారా షరీఫ్ ప్రాంతంలోని కల్సిలో మా ఇంటి సమీపంలో ఓ దట్టమైన అడవి ఉంది. ఆ రోజు రాత్రి దాదాపు 9.30 గంటల సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు మా ఇంటి తలుపు తట్టారు. మా నాన్న నూర్ హుస్సేన్, తలుపు తీయలేదు. దీంతో ఉగ్రవాదులు కిటికీలోంచి లోపలికి ప్రవేశించారు. మా అమ్మ.. నన్ను, నా తమ్ముడిని రక్షించేందుకు.. మా ఇద్దరినీ మంచం కింద దాచింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు తోచలేదు. నా కుటుంబం ప్రమాదంలో చిక్కుకోవటం చూసి, నాకు ధైర్యం వచ్చింది. నేను గొడ్డలిని తీసుకుని, పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఉగ్రవాది తలపై కొట్టాను. దీంతో అతడు అక్కడే పడిపోయాడు. వెంటనే ఇంకో ఉగ్రవాది మాపై కాల్పులు జరిపాడు. నా గొడ్డలి దెబ్బకు చనిపోయిన ఉగ్రవాది వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్ తీసుకుని నేను కూడా వారిపై కాల్పులు జరిపాను. ఈ ఘటనలో ఆ రెండో ఉగ్రవాదికి గాయాలయ్యాయి. ఇది చూసిన మరో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడని" ఆమె చెప్పింది. వెంటనే రుక్సానా పోలీసు స్టేషన్కు వెళ్లి ఈ ఘటనలో జరిగిన విషయాన్ని తెలియజేసింది.
![Movie the brave girl Rukhsana Kausar who killed a terrorist with an axe in Jammu and Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17154556_hfgh.jpg)
![Movie the brave girl Rukhsana Kausar who killed a terrorist with an axe in Jammu and Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17154556_gjghjn.jpg)
ఈ ఘటన ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు బాలీవుడ్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రుక్సానా పాత్రలో నటి శ్రద్ధా కపూర్ పోషించనుంది. ఈ నెలాఖరున సినిమాను ప్రకటించనున్నారు. ఇందుకోసం దర్శకుడు ఆసిఫ్ అలీ, చిత్ర నిర్మాత అశోక్ చౌహాన్ రుక్సానాను కలిశారు. డిసెంబర్ 20న ముంబై వెళ్లేందుకు రుక్సానా సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రుక్సానా ధైర్యసాహసాలను ప్రస్తావించి, ఆమెను మెచ్చుకున్నారు.