Yadadri Giri Pradakshina Arrangements : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుడి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు గిరిప్రదక్షిణ చేపడుతుంటారు. యాదాద్రికి వచ్చే భక్తులకు మరింత భక్తి భావం పెంపొందించే దిశగా గిరిప్రదక్షణ చేసే వారి సంఖ్య పెంచేందుకు గాను తేది.15-07-2024 (సోమవారం)న స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఉదయం గం.6.05 నిమిషాలకు కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభించి తిరిగి వైకుంఠ ద్వారం వరకు గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ అధికార యంత్రాంగం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం దేవస్థాన పరిసర ప్రాంతంలో పచ్చదనం అభివృద్ధి చేయుటకు ముఖ్య నేతల సూచనల మేరకు గిరి ప్రదక్షిణ మార్గానికి ఇరుపక్కల మొక్కలు నాటేందుకు వన మహోత్సవం నిర్వహిస్తున్నారు. సదరు కార్యక్రమానికి భక్తులు, కొండపై వర్తక సంఘం సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.