Thunderstorm On House At Hanamkonda : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల పిడుగులు పడి ఆస్తి నష్టం వాటిల్లుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలోని ఓ ఇంటిపై పిడుగు పడి సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సీసీ కెమెరాల విక్రయ దారుడు అరుణ్ తన తల్లి రాధికతో కలిసి రంగయ్యపల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. సోమవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు బాధితులు తెలిపారు.
రాత్రి సమయంలో ఇంటిపై పిడుగు పడి ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. మంటల్లో ఇంట్లో ఉన్న రూ.13 లక్షల విలువ గల సీసీ కెమెరాలు, రెండు జిరాక్స్ మిషన్లు, బంగారం, మూడు లక్షల రూపాయల నగదు కాలిబూడిద అయ్యాయని బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరారు.