Street Dog Attack on Public in Mancherial : తెలంగాణలో వీధి శునకాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో చిన్నాపెద్దా ఎవరైనా ఒంటరిగా బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సున్నంబట్టి వాడలో తాళ్లపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఉండగా అతనిపై దాడి చేసి చేతి బొటనవేలును కొరికింది. దీంతో ఆయన విడిపించుకునే ప్రయత్నం చేసినా వదల్లేదు. చివరకు బొటనవేలును నోట కరుచుకొని పరుగెత్తింది.
ఆపై అదే కాలనీలో ఆడుకుంటున్న నలుగురు చిన్నారులపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడదపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.