Police Destroyed Ganja Plants in Sangareddy : అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హంగార్గ-బీ గ్రామంలో జరిగింది. కంకర క్రషర్ల వద్ద పని చేస్తూ గంజాయిని సేవించేందుకు యూపీ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమతో పాటు గంజాయి విత్తనాలను తెచ్చుకున్నారు. అనంతరం వారు నివసించే ప్రాంతంలో వాటిని చల్లారు.
అవి పెరిగి పెద్దవి కావడంతో గంజాయి వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రషర్ వద్దకు చేరుకుని ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 16 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అనంతరం వారిద్దరిని అరెస్టు చేశారు. మత్తు పదార్థాలు సేవించినా, వాటిని పెంచినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.