MP Kadyam Kavya help to Orphan : నెల రోజుల వ్యవధిలో తల్లితండ్రులను కోల్పోయి అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారిని వరంగల్ ఎంపీ కడియం కావ్య అక్కున చేర్చుకున్నారు. ఇకపై ఆమె అవసరాలను ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రం శివారు కోనాపురం గ్రామానికి చెందిన ఎలికట్టే భాస్కర్ నెల రోజుల క్రితం కరెంట్ షాక్కు గురై చనిపోయాడు. అతడి భార్య స్వరూప అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. దీంతో వారి నాలుగేళ్ల కుమార్తె అనాథగా మారింది.
విషయం తెలుసుకున్న ఎంపీ కావ్య బాలిక వద్దకు చేరుకుని ఆమె దైన్యస్థితిని చూసి చలించిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలిక సంరక్షణను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపై ఆమె అన్ని అవసరాలు ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. బాలల సంరక్షణ అధికారులతో మాట్లాడి బాలిక బంధువుల నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.