Man Killed in Lightning Strike : పిడుగుపాటుకు యువకుడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మరాం(బి)లో శుక్రవారం చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన శాకటి ప్రేమ్ కుమార్(32) సాయంత్రం 6 గంటల సమయంలో డిచ్పల్లి వెళ్తుండగా ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రేమ్కుమార్ చెట్టు కిందకు చేరుకోగా పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.
రాత్రి అయినా ప్రేమ్కుమార్ ఇంకా ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, రాత్రి 12 గంటల సమయంలో వెతకగా గ్రామ శివారులో మృతి చెంది కనిపించాడు. మొదట అనుమానాస్పద మృతిగా భావించి పోస్టుమార్టం నిర్వహించగా పిడుగుపాటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, 18 నెలల పాప ఉంది. మృతుడు ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.