PC Ghose Committee on kaleshwaram : కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. నీటి పారుదల శాఖ ఇంజినీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే విచారించిన కమిషన్, అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వచ్చిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది.
గతంలో విచారణ, అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియపై జస్టిస్ పీసీ ఘోష్ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా నేటి నుంచి తదుపరి ప్రక్రియ కొనసాగించనున్నారు. అఫిడవిట్లలోని సమాచారం, వివరాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు కూడా కమిషన్ సిద్ధమవుతోంది. బీఆర్కే భవన్లోని పదో అంతస్తులో బహిరంగ విచారణ జరపనున్నారు. ఈ దఫా విచారణ ప్రక్రియ పది రోజుల పాటు సాగే అవకాశం ఉంది.