Justice PC Ghose Commission Interrogate Engineer Raghu Today : జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విద్యుత్ శాఖ ఇంజినీర్ రఘు నేడు విచారణకు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. సాంకేతికపరమైన అంశాల విచారణ తుది దశకు చేరుకోగా ఆర్థిక అంశాలపై విచారణను వేగవంతం చేసేందుకు కమిషన్ సిద్ధమైంది. అందులో భాగంగా ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు, ఇతరుల నుంచి కమిషన్ అవసరమైన సమాచారం, వివరాలు తీసుకుంటోంది.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో రఘు నేడు కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, సమాచారం, వివరాలను కమిషన్ తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కమిషన్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.