B.Tech Student Dies of Dengue : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. డెంగీ బారినపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన మిర్యాల శ్రీనివాసులు టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆయన రెండో కుమార్తె నికిత (21) హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది. నెల రోజుల క్రితం సెలవులపై ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైంది.
దీంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, ప్లేట్లేట్స్ కౌంట్ తగ్గిందని, డెంగీ లక్షణాలున్నట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 10 రోజుల పాటు చికిత్స అనంతరం సోమవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేసినా తమ బిడ్డ ప్రాణం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.