BJP Leader BL Santhosh Meeting Hyderabad : తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బీఎల్ సంతోశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడం శుభ సంకేతమని, పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు. అంతా కలిసి కట్టుగా పని చేయాలని, అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై తీసుకున్న పోరాటాలపై బీఎల్ సంతోశ్ ఆరా తీశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పని చేయాలని స్పష్టం చేశారు. అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో బీఎల్ సంతోశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలపై ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.