Student Commits Suicide in Nizamabad : అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ వాష్రూమ్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే రుద్రూర్ మండలం అక్బర్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్కు చెందిన రక్షిత పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. విద్యార్థినిని ఈనెల 27న ఆమె తల్లిదండ్రులు కళాశాలలో చేర్చినట్లు ప్రిన్సిపల్ బాలాజీ నాయక్ తెలిపారు.
ఉదయం ఐదున్నర, ఆరు గంటల ప్రాంతంలో రక్షిత తన గదిలో నుంచి వాష్రూమ్కి వెళ్లింది. ఎంతసేపటికి గదిలోకి రాకపోవడంతో, అనుమానం వచ్చిన విద్యార్థులు డ్యూటీ టీచర్కు సమాచారం ఇచ్చారు. అనంతరం సీనియర్ స్టూడెంట్స్ వచ్చి తలుపు బద్దలుకొట్టగా రక్షిత విగతజీవిగా పడి ఉంది. పోలీసులు మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.