Cyber Attack On China : చైనాపై గుట్టు చప్పుడు కాకుండా సైబర్ దాడి జరిగింది. ఎట్టకేలకు దీనిని గుర్తించిన చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. వాస్తవానికి చైనా ప్రభుత్వం, కంపెనీలు ఆధునికీకరణలో భాగంగా తమ పాత కంప్యూటర్లు, నెట్వర్క్ సాధనాలు, సర్వర్లు, సీసీటీవీ కెమెరాలను మూలన పడేస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని, విదేశీ గూఢచారి సంస్థలు ఆ పాత పరికరాలు, సర్వర్ల ద్వారా చైనా జాతీయ, వాణిజ్య రహస్యాలను చోరీచేస్తున్నాయని చైనా జాతీయ భద్రతా శాఖ (ఎంఎస్ఎస్) గుర్తించింది.
వలపు వల!
"విదేశీ గూఢచారులు డేటింగ్ పేరిట చైనీయులకు వల వేస్తున్నారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్లుగా నటిస్తున్నారు. అధిక వేతనాలతో పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నట్లు చైనా విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫొటోగ్రఫీ ప్రాజెక్టుల పేరుతో కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ-మెయిల్స్ పంపి వ్యక్తిగత మెయిల్ బాక్స్లలోని సమాచారాన్ని చోరీ చేస్తున్నారు" అని చైనా జాతీయ భద్రతా శాఖ తెలిపింది.