Spam Calls Crackdown : అవాంఛిత ఫోన్ కాల్స్, అన్ రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్లపై టెల్కోలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా 2.75 లక్షల మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు బ్లాక్ చేశాయి. మరో 50 సంస్థలనూ నిషేధిత జాబితాలో చేర్చాయి. అన్రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లపై చర్యలు తీసుకోవాలన్న ట్రాయ్ ఆదేశాల మేరకు టెల్కోలు ఈ చర్యలు చేపట్టాయి.
ఈ మేరకు ట్రాయ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైందని ట్రాయ్ పేర్కొంది. 2024 ఏడాది తొలి అర్ధభాగంలోనే అన్రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లపై మొత్తం 7.9 లక్షల ఫిర్యాదులు అందాయని తెలిపింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కాల్స్ తక్షణమే నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ఆగస్టు 13న ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేసింది. టెలికాం వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు తోడ్పడాలని ఆయా సంస్థలకు సూచించింది.