Elderly Population In India : భారత దేశంలో వృద్ధుల జనాభా 2050 నాటికి రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్(UNFPA) ఇండియా చీఫ్ ఆండ్రియా వోజ్నార్ అంచనా వేశారు.పేదరికంలో ఉన్న ఒంటరి వృద్ధ మహిళల ఆరోగ్య సంరక్షణ, గృహాలు,పెన్షన్ కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2050 నాటికి 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య 346 మిలియన్లకు చేరుతుందని పేర్కొన్నారు.
"2050 నాటికి భారత దేశంలో 50 శాతం పట్టణాలు ఉంటాయి. మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలను తీర్చడానికి భారత్ స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాలు, గృహాలను నిర్మించడం చాలా కీలకం. భారతదేశం గణనీయమైన యువ జనాభాను కలిగి ఉంది. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 252 మిలియన్ల మంది ఉన్నారు" అని UNFPA చీఫ్ ఆండ్రియా వోజ్నార్ తెలిపారు.