Doctors Meet Mamata : ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కోల్కతాలో నిరసనలు చేస్తున్న వైద్యులకు, బంగాల్ ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన వీడటం లేదు. ప్రభుత్వం పిలుపు మేరకు శనివారం సాయంత్రం సీఎం మమతా బెనర్జీ నివాసానికి వైద్యులు వెళ్లినా, చర్చలు మాత్రం జరగలేదు. ముందుగా చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ పట్టుబట్టిన వైద్యులు చివరికి వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి వైద్యులు తెలిపారు. అప్పటికే సమావేశం కోసం మూడు గంటల పాటు వేచి ఉన్నామని, ఆలస్యమైన కారణంగా ఇప్పుడు చర్చలు నిర్వహించలేమని సీఎం కార్యాలయం తెలపగా, వైద్యులు వెనుదిరిగారు.
'ప్రత్యక్ష ప్రసారం విషయంలో మేం వెనక్కి తగ్గాం. ఈ విషయాన్ని సీఎం కార్యాలయానికి వెల్లడించాం. ఆలస్యమైందంటూ మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు చెప్పారు. సమస్యను ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం విడ్డూరంగా ఉంది' అని వైద్యులు ధ్వజమెత్తారు.