Supreme Court Next CJI Sanjiv Khanna : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు.
నిబంధనల ప్రకారం, ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబరు 11తో ముగియనుంది. ఆ మరుసటి రోజున జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే13న పదవీ విరమణ చేస్తారు.