మత్స్యశాఖ ఉద్యోగిని ఈడ్చుకెళ్లి కొట్టిన వైసీపీ నాయకుడు - తన్నండి వీడిని అంటూ దుర్భాషలాడుతూ - kakinada district news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 9:54 AM IST
YSRCP Leader Attack on Fisheries Department Employee: ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ నాయకుడు దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఉప్పాడ సచివాలయంలో మత్స్యశాఖ సహాయకుడిగా పనిచేస్తున్న పరుశురాం అనే వ్యక్తిపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు అతను అనుచరులు దాడి చేశారు. చిన్నారావు కుటుంబీకుల పేరిట ఉన్న 14 ఎకరాల రొయ్యల చెరువులకు విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ కోరుతూ దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం 10 ఎకరాలలోపు విస్తీర్ణానికే రాయితీ వర్తిస్తుందని, 14 ఎకరాలు ఉన్నట్లు ధృవీకరణ పత్రం ఉండడంతో రాయితీ వర్తించదని పరుశురాం తెలిపారు. రాయితీ రాకుండా అడ్డుకుంటున్నాడని భావించి ఉద్యోగిపై చిన్నారావు తన అనుచరలతో కలసి దాడికి పాల్పడ్డాడు.
తహసీల్దార్ కార్యాలయంలో పలువురు జిల్లాస్థాయి అధికారులు సమీక్ష జరుగుతుండగా చెన్నారావు అక్కడికి వచ్చి రాయితీ గురించి అడిగారు. ఆ రొయ్యల చెరువులకు రాయితీ అర్హత లేదని అధికారులు తెలిపారు. కార్యాలయం నుంచి బయటకు వస్తున్న చిన్నారావు సమీపంలో ఉన్న మత్స్యశాఖ సహాయకుడు పరశురాముని చూసి అతను వద్దకు వెళ్లి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి తన అనుచరులతో దాడి చేయించాడు. ఆ దృశ్యాలను ఉద్యోగి సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా, దుర్భాషలాడి దానిని తీసుకొని నేలకేసి కొట్టారని పరశురాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని బాధితుడు వాపోతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని బాధిత ఉద్యోగి కోరాడు.