మంగళగిరిలో కొనసాగిన వైసీపీ నేతల చేరికలు- నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దుతా : లోకేశ్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 9:34 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-01-2024/640-480-20607009-thumbnail-16x9-ycp-leaders-joined-tdp.jpg)
YCP Leaders Joined TDP in Lokesh Presence: మంగళగిరిలో గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం పని చేయాలని శ్రేణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరిని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకున్నానని అన్నారు. సీనియర్లను గౌరవిస్తా పని చేసే వారిని ప్రొత్సహిస్తానని స్పష్టం చేశారు. మంగళగిరిలో తాను ఓడిపోయాక ఉత్తరాంధ్ర వెళ్లి పోటీ చేయమని ఎంతో మంది సలహా ఇచ్చారు కానీ మంగళగిరిలో ఓటమి తర్వాత తనలో కసి, బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. వచ్చే 72 రోజులు చాలా ముఖ్యమని పట్టు విడవకుండా పని చేయాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. గత కొన్నేళ్లుగా దుగ్గిరాల మండలం నేతలు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, యడ్ల వెంకటరావు, జయలక్ష్మి, పలు గ్రామాల సర్పంచ్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి లోకేశ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.