వర్షానికి చెరువైన ఎమ్మార్వో కార్యాలయం - బిక్కుబిక్కుమంటున్న సిబ్బంది - ANAKAPALLE MRO OFFICE - ANAKAPALLE MRO OFFICE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 4:56 PM IST
MRO Office Staff Faced Problem Dilapidated Building in Anakapalli : భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దూరం చేసేలా ఎప్పటికప్పుడు అందర్నీ అప్రమత్తం చేసే రెవెన్యూ ఉద్యోగులకే జిల్లా కేంద్రం అనకాపల్లిలో రక్షణ లేకుండా పోయింది. శిథిలావస్థకు చేరిన కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. పై పెంకులన్నీ దెబ్బతినడం వల్ల భారీ వర్షాలకు ఎమ్మార్వో కార్యాలయం తడిసిపోయింది. కంప్యూటర్లు, ఫైళ్లు తడిసిపోకుండా పైనుంచి కారుతున్న నీటిని బకెట్లు, ట్రేలలో ఒడిసి పట్టి బయట పారబోస్తున్నారు. నీటిలో వైర్లు తడసి ఓ మహిళ ఉద్యోగి విద్యుదాఘాతానికి గురయ్యారని అధికారులు పేర్కొన్నారు. వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరుస్తామని భరోసా ఇచ్చే తమ పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు, మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఆఫీసు మొత్తం చెరువులా తయారైందని అధికారులు వాపోతున్నారు. కార్యాలయం పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అంతలోనే ఎలక్షన్స్ రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్యాలయం మరమ్మతులపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.