Arasavalli Surya Bhagwan Temple Selected By Prasad Scheme : శ్రీకాకుళం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం. ఆధ్యాత్మికతతో పాటు త్వరలో పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఇటీవల ఘనంగా రథసప్తమి వేడుకలు జరుపుకున్న ఈ క్షేత్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఉట్టిపడే నిర్మాణాలు, కనువిందు చేసే పచ్చికబయళ్లు, మిరుమిట్లు గొలిపే దీపకాంతులు, సువిశాల రహదారులు ఇలా ఒక్కటేమిటి దేశ నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్తరూపు సంతరించుకోనున్న అరసవల్లి దేవాలయంపై ప్రత్యేక కథనం.
ఆరోగ్య సమస్యలు మాయం : వెలుగులరేడు సూర్య భగవానుడు దేశంలోనే నిత్య పూజలు అందుకున్న ఆలయంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి క్షేత్రం పేరొందింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్టును స్పర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. సూర్య భగవానుడు ఆరోగ్య సమస్యలు తీర్చుతాడని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
అరసవల్లిలో అద్భుతం - మూలవిరాట్ పాదాలను తాకిన సూర్యకిరణాలు
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకానికి ఎంపిక చేసింది. ఆలయ ఆగమశాస్త్రానికి లోబడి, స్తపతులు పర్యవేక్షణలో ఆలయ ప్రాచుర్యం, చారిత్ర్మాకత ఏమాత్రం దెబ్బతినకుండా అరసవల్లి మిల్లు కూడలి నుంచి ఆలయం వరకు టెంపుల్ జోన్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
ఆలయానికి కొత్త సొబగులు : దేశ, విదేశాల్లో ఉన్న భక్తులు ఆలయంలో స్వామివారికి చేపట్టే పూజల్లో నేరుగా, వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు వీలుగా టీటీడీ మాదిరిగా ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించనున్నారు. గదుల బుకింగ్, స్వామివారి దర్శన టిక్కెట్లు, విరాళాలు, కల్యాణోత్సవం, సూర్య నమస్కారం, క్షీరాభిషేకాలు, తిరువీధి తదితర పూజల్లో పాల్గొనేందుకు ఆన్ లైన్లో నిర్దిష్ట రుసుం చెల్లించి ఆయా సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డీపీఆర్కు అనుగుణంగా పనులు పూర్తయితే ఆదిత్యుని ఆలయం కొత్త సొబగులు సంతరించుకుని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒక కలికితురాయిగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
అరసవల్లి రథసప్తమి వేడుకలు ప్రారంభం - స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయంలో చేపట్టే పనులకు సంబంధించిన డీపీఆర్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అనుమతితో ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
అరసవల్లి ఆలయంలో రథ సప్తమి వేడుకలు- ఒక్కసారి దర్శిస్తే సకల పాపాలు నశించడం ఖాయం!