By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 12:10 PM IST
కంపెనీ పేరుతో భూ కుంభకోణం - మంత్రి జయరాం వెనుక సీఎం జగన్ : బీటీ నాయుడు
TDP MLC BT Naidu Comments on Minister Jayaram: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతి వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తముందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆలూరులో ఇటినా కంపెనీ పేరుతో జయరాం అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇటినా కంపెనీ ఏర్పాటు చేస్తానని చెప్పి 443 ఎకరాలను రైతుల నుంచి చౌకగా తీసుకొని ఇంతవరకు ఇండస్ట్రీ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రికి ఐటీ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. ఇటినా కంపెనీ పేరుతో మంత్రి పేదల దగ్గర నుంచి తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. జయరాం బయటకు వచ్చి ముఖ్యమంత్రి పాత్రను బయట పెట్టాలని బీటీ నాయుడు కోరారు. వైసీపీలో సామాజిక న్యాయం లేదని ముఖ్యమంత్రి మార్చిన సీట్లన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవే అని ఆయన అన్నారు.
ఇటినా కంపెనీ పేరుతో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెబితే ప్రజలు నిజమనుకున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీ కాదు కదా అక్కడ భూమి పూజ కూడా చేయలేదు. 45కోట్ల రూపాయల అవినీతి వెనుక ఎవరు ఉన్నారని అధ్యయనం చేస్తే సీఎం జగన్ హస్తముందని తెలిసింది. మంత్రి గుమ్మనూరు జయరాం ప్రజల ముందు అసలు విషయం బయటపెట్టాలి. -బీటీ నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ