Published : 2 hours ago
నీళ్ల కోసం కన్నీళ్లు - కేజీబీవీలో విద్యార్థినుల అవస్థలు - WATER PROBLEMS IN KAMAREDDY KGBV
Water Problem in Pitlam KGBV School : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో బకెట్లను వరుసలో పెట్టి నీళ్ల కోసం విద్యార్థినులు వేచిచూస్తున్న పరిస్థితి ఇది. భూగర్భజల మట్టం పడిపోవడంతో బోర్ మోటార్ నుంచి నీరు పై అంతస్తులో ఉన్న ట్యాంకులోకి వెళ్లడం లేదు. బడి ఆవరణంలో ఉన్న పైపులు ద్వారా నీటిని బకెట్లలో నింపి పైకి మోసుకెళ్లి విద్యార్థినులు వాడుకుంటున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న 305 మంది బాలికలు ఇలా రోజు నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాఠశాల ప్రిన్సిపల్ సంబంధిత అధికారులకు చెప్పినా అస్సలు పట్టించుకోవడంలేదని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. నీటి కోసం చాలా సమయం వృథా చేయాల్సి వస్తోందని వాపోయారు. ఉదయం సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను విద్యార్థినులు కోరారు.