Tirumala live: కనుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సూర్యప్రభ వాహనంపై దర్శనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
Tirumala Live : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. సూర్యప్రభ వాహనంలో ఉండే నారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి వారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, రాత్రి వేళల్లో మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై వివిధ రకాల వేషధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 6వ రోజు బుధవారం మలయప్పస్వామి స్వర్ణరథం, గజ వాహనాలపై పయనించి భక్తులను కటాక్షించారు. ముందుగా సాయంత్రం స్వర్ణరథంపై ఆ తిరుమల వేంకటేశ్వరుడు పయనించాడు. మాడవీధులలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని స్వయంగా లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే భూదేవి కరుణతో సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం.