అధికారులుకు ఇసుక మాఫియా షాక్- వారిద్దరివీ డ్రామాలంటున్న స్థానికులు - Sand Lorry At Revenue Office
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 7:57 PM IST
Sand Lorry At Revenue Office Was Missing: పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరపొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కలెక్టర్లు, గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించింది. అయినా కూడా ఇసుక తవ్వకాలు యథావిధిగా సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా దర్జాగా తవ్వకాలు కొనసాగించి విక్రయాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న వాహనాలను అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలిస్తే ఇసుక మాఫియా గట్టి షాక్ ఇచ్చింది. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటనపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు గురించి సమాచారం అందుకున్న రెవెన్యూ, గనుల శాఖ అధికారులు సినీఫక్కీ తరహాలో దాడి నిర్వహించారు. క్వారీలో ఇసుక తవ్వకాలు చేపడుతున్న జేసీబీ, లారీని రెవెన్యూ గనుల శాఖ అధికారులు జప్తు చేసి తాడేపల్లి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఉన్న లారీని ఇసుక మాఫియా మారుతాలంతో ఎత్తుకెళ్లి అధికారులకు ఝలక్ ఇచ్చారు. జప్తు చేసిన లారీని పోలీస్ స్టేషన్లో అప్పగించకుండా తహశీల్దార్ కార్యాలయం దగ్గర ఎందుకు పెట్టారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాతో మాట్లాడుకునేందుకే లారీని స్టేషన్లో అప్పగించకుండా రెవెన్యూ కార్యాలయం దగ్గర పెట్టారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.