కొనసాగుతున్న ఆర్ఇసీ ఉద్యోగుల నిరసనలు - మద్దతు పలికిన రాజకీయ పార్టీలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 3:21 PM IST
REC Employees Protest in Chipurupally : విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మూడు రోజులుగా ఆర్ఇసీ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. వీరి ఆందోళనకు టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, చీపురపల్లి వ్యవసాయ విద్యుత్ సంఘం పరిధిలో ఉన్న ఆర్ఈసీని ఏపీ ఈపీడీసీఎల్లో ఎందుకు విలీనం చేశారని మండిపడ్డారు. విలీనం చేయటం వల్ల ప్రజలపై అధిక బిల్లుల భారం మోపి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెలిపారు. సుమారు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తున్న సంస్థను ఎందుకు ఏపీ ఈపీడీసీఎల్ లో విలీనం చేశారు నిలదీశారు.
సంస్థ విలీనంపై మంత్రి బొత్స సత్యనారాయణ తికమక సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. కుప్పంలో, అనకాపల్లిలో రెస్కో సంస్థ పేరుతో విద్యుత్ బిల్లులు ఇస్తుంటే చీపురుపల్లిలో మాత్రం బోర్డు నుండి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండి కూడా రెస్కో సంస్థ విలీనాన్ని ఆపలేకపోయారని మండిపడ్డారు. నిజంగా బొత్స సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ ఎంక్వయిరీ రిపోర్టును ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.