By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 1:14 PM IST
మడకశిర మహిళకు మోదీ ప్రశంసలు- స్వశక్తి నారి వికసిత్ భారత్ కార్యక్రమంలో ముఖాముఖి
Prime Minister Narendra Modi Appreciate The Woman: సత్యసాయి జిల్లా మడకశిర మండలం మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్ అనురాధకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు తెలియజేశారు. దిల్లీలో సోమవారం జరిగిన స్వశక్తి నారి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆమెతో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంత మహిళా సమాఖ్య ద్వారా సంఘాల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణ బాధ్యతలపై పలు రాష్ట్రాల వారికి శిక్షణ ఇస్తున్న ఆమెను ప్రధానితో ముఖాముఖి కార్యక్రమానికి అధికారులు ఎంపిక చేశారు. మహిళా సంఘాల ద్వారా ఆమె అంచెలంచెలుగా ఎదగడాన్ని సభా ముఖంగా మోదీ ప్రశంసించారు.
మోదీతో ఆమె మాట్లాడుతూ తొలుత బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఇంటిలోనే చీరల వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆ చీరల వ్యాపారంతోనే ఆమె కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద బిడ్డ ఇంజినీరింగ్, చిన్న కుమార్తెను ఎంబీఏ చదివించినట్లు తెలిపారు. మహిళా సంఘాల్లో ఉంటూనే తాను బీకాం పూర్తి చేసి ఆరు నెలల్లో హిందీ భాషను నేర్చుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆమె అంచలంచలుగా ఎదగడాన్ని సభా ముఖంగా అనురాధపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.