బీచ్లో పెరుగుతున్న ప్రమాదాలు- పర్యాటకుల రాకపై పోలీసుల ఆంక్షలు - Temporarily Closed Bapatla Beach
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 1:14 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/640-480-21790476-thumbnail-16x9-police-restrictions.jpg)
Police Restrictions on Bapatla And Suryalanka Beaches: బాపట్ల జిల్లాలోని రామాపురం ఓడరేవు బీచ్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని మెరైన్ నిపుణుల నివేదికలను అనుసరించి బాపట్ల, చీరాల బీచ్లో సందర్శకుల రాకపోకలను నిలిపివేస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పడమర గాలుల తీవ్రత తగ్గాకే బీచ్లో సందర్శకులను అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. బాపట్ల పరిధిలోని సూర్యలంక బీచ్ సురక్షితమే అయినా అక్కడ కూడా కొద్ది రోజులపాటు సముద్ర స్థానాలకు పర్యాటకులను అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు.
సందర్శకులను సోమవారం నుంచి నిలుపుదల చేశారు. బాపట్లలోని సూర్యలంకతోపాటు వేటపాలెం మండలం రామాపురం, వాడరేవు బీచ్లకు విహారం కోసం వచ్చే పర్యాటకులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఒక రోజే ఇద్దరు యువకులు రామాపురం బీచ్లో అలల తీవ్రతకు కొట్టుకుపోయి మృతి చెందారు. ఇదే బీచ్లో గత శుక్రవారం ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయి చనిపోయారు. ఒక్క జూన్ మాసంలోనే ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.