'తుపాకీ కాల్పుల సీన్' - నిందితులను పట్టుకున్న పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 2 hours ago
Police Chase Gun Firing Case in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం వద్ద ఈ నెల 20న జరిగిన తుపాకీ కాల్పుల ఘటన కేసును పోలీసులు ఛేదించారు. ధర్మవరంలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ రత్న తెలిపారు. అన్నమయ్య జిల్లా షికారి పాలెం గ్రామానికి చెందిన నిందితులుగా పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకే బంగారాన్ని ఇస్తామని చెప్పి ప్రజలకు నకిలీ బంగారాన్ని విక్రయించి మోసం చేసేవారని విచారణలో వెల్లడైందన్నారు. నిందితుల నుంచి నకిలీ తుపాకులు, బంగారం, కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించామని ఎస్పీ తెలిపారు. దీనికి సూత్రదారి ఒక ఎథికల్ హ్యాకర్ అని, వారికొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్లు, వీడియో పోస్ట్ చేసుకోవడం కోసం వారు ఇలా చేశారని పోలీసులు వెల్లడించారు.
సినీఫక్కీని తలపించే విధంగా ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారిని పట్టుకునేందుకు కొంత మంది రెండు కార్లతో వెంబడిస్తూ కాల్పులు జరిపారు. ఇదంతా చూస్తున్న స్థానికులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన బత్తలపల్లి మండలం రామాపురం గ్రామం జాతీయ రహదారిపై నాలుగు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే.