By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 9:37 AM IST
చిత్తూరు జిల్లాలో సీఐ, ఎస్ఐల బదిలీలు - సీఎం పర్యటనకు ఒకరోజు ముందు హడావిడి - Police Officers Transfer in Chittor
Police Officers Transfer in Chittor District : ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు ఒక్కరోజు ముందు సీఐలు, ఎస్ఐలను బదిలీ చేస్తూ చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కుప్పంలో వైఎస్సార్సీపీకి వంతపాడిన ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలను ఒకేసారి వీఆర్కు పంపిస్తూ అనంతపురం డీఐజీ షేముషి బాజ్పేయ్ ఉత్తర్వులు ఇచ్చారు. కుప్పం పట్టణ సీఐ రమణను అనంతపురం వీఆర్కు పంపించారు. గ్రామీణ సీఐ ఈశ్వర్రెడ్డిని బదిలీ చేశారు. కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మికాంత్ను ఎస్పీ బదిలీ చేశారు.
రామకుప్పం ఎస్ఐ శివ, రాళ్లబుదుగు ఎస్ఐ సుమన్పై బదిలీ వేటు పడింది. ఇదే సమయంలో గుడుపల్లె ఏఎస్సై మోహన్, రామకుప్పం హెడ్కానిస్టేబుల్ మురళిపైనా జిల్లా ఎస్పీ వేటు వేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోహన్ కుప్పం సర్కిల్ పరిధిలోనే విధులు నిర్వహించారు. సీఐలు, ఎస్సైలు సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ నేతలపై విపరీతమైన స్వామిభక్తిని ప్రదర్శించారు. టీడీపీ శ్రేణులను అడుగడుగునా ఇబ్బంది పెట్టి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.