అంత్యక్రియలకు అవస్థలు - పట్టించుకోని అధికారులు - ntr district news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 10:22 AM IST
No Road to Cremation Ground: అంత్యక్రియలు నిర్వహించడానికి రుద్రభూమికి వెళ్లేందుకు ప్రభుత్వం రహదారి సౌకర్యం కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరు ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. కాలనీలో ఎవరైన కాలం చేస్తే మృతదేహాన్ని మరుభూమికి తీసుకువెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డ కోట మాణిక్యరావు సోమవారం మృతి చెందారు. మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు బయలు దేరారు.
అక్కడికి వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో వరి పంట సాగు భూమిలో దిగి బురదలో నడుచుకుంటూ మృతదేహాన్ని అతి కష్టం మీద తీసుకెళ్లారు. కొందరు పంట చేను గట్లపై, మరికొందరు పొలంలో నడుచుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ తీవ్ర ఇబ్బందుల నడుమ శ్మశానానికి చేరుకున్నారు. వర్షాకాలంలో మరింత తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని స్పందనలో పలుమార్లు చేసిన విజ్ఞప్తులను అధికారులు బుట్టదాఖలు చేశారని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.