'జగన్ ప్రభుత్వానికి మద్దతిచ్చేవారు చేతులెత్తండి' - కనీసం పట్టించుకోని అంగన్వాడీలు - కుప్పంలో వైసీపీ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 10:20 PM IST
MP Reddeppa Election Campaign in Kuppam Constituency : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేదికపై అధికార వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని అంగన్వాడీలను కోరారు. వచ్చే ఎన్నికల్లో సహకరించాలని పదేపదే అడిగినా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఏ మాత్రం స్పందించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్, ఎంపీగా తాను నిలబడతానని ఓట్లు వేసేవారు చేతులెత్తాలని ఎంపీ కోరగా కేవలం కొంతమంది మాత్రమే చేతులెత్తి వెంటనే దించేశారు. తాము ఓట్లు అడగలేదని జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు చేతులెత్తాలని మరోసారి వేడుకున్నారు. అయినప్పటికీ అంగన్వాడీలు చేతులు ఎత్తలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రెడ్డప్ప కుప్పంలో పరిస్థితి ఇదీ అని వేదికపై ఉన్న భరత్తో అన్నాడు. చివరికి వైసీపీ నాయకులు వేదికపై నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతుండగా కనీసం చేతులు ఎత్తి మద్దతు ఎందుకు తెలపలేదని వైసీపీ ఎంపీపీ అశ్విని అంగన్వాడీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు మద్దతుగా చేతులు పైకి ఎత్తాలని ఎంపీ వేడుకుంటుండగా అంగన్వాడీలు ఎత్తకపోవడంతో వేదికపై నుంచి చూస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నవ్వుకోవడం కనిపించింది. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై నాయకులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వస్తే బాగుండదని హెచ్చరిక చేశారు.